మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఫిర్జాదిగూడ పరిధిలోని శంకర్నగర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. తేజస్విని అనే యువతి స్థానిక చెరువులో మృతదేహంగా కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, వైజాగ్కు చెందిన తేజస్విని గతంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసింది. సుమారు ఆరు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె ప్రస్తుతం తన తల్లితో కలిసి ఫిర్జాదిగూడలో అద్దె ఇంట్లో నివసిస్తోంది.
సీసీటీవీ దృశ్యాల ప్రకారం, ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి సమయంలో తేజస్విని సమీపంలోని ఆలయానికి వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి చెరువు వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున ఆమె మృతదేహం చెరువులో లభ్యమైంది.
తెలంగాణలో ఒంటరి మహిళలకు శుభవార్త.. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు అమలు
ఘటన అనంతరం ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఆలయంలోని అమ్మవారి విగ్రహానికి అలంకరించిన చీర కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆలయం పరిసరాల్లో గాలింపు చేపట్టగా, ఆ చీర చెరువు సమీపంలో లభించినట్లు తెలిపారు. ఈ అంశాన్ని కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు.
తేజస్విని తల్లి ఇచ్చిన వాంగ్మూలంలో, కుమార్తె కొంతకాలంగా మానసిక ఆందోళనకు గురవుతూ, తాము ఉంటున్న ఇంట్లో పీడకలలు వస్తున్నాయని తరచూ చెప్పేదని పేర్కొన్నారు. దీంతో ఇటీవలే మరో అద్దె ఇంటిని చూసి మారాలని నిర్ణయించుకున్నామని ఆమె వెల్లడించారు. అయితే ఇల్లు మారకముందే ఈ విషాద ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరణానికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
40 ఏళ్లు దాటాక ఈ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.. ముందస్తు జాగ్రత్తలే ప్రాణ రక్షణ
ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలు తదితర అంశాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది.

టీటీడీ కొత్త డోనర్ పాలసీ.. దాతలకు మారిన ప్రత్యేక దర్శనాలు.. సామాన్య భక్తులకు మరిన్ని అవకాశాలు
