తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఎన్నికల అధికారులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచి, నమోదు శాతాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లెక్సీలు, సమాచార బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
మొదట ఈ ప్రక్రియకు జూలై 24ను చివరి తేదీగా నిర్ణయించినప్పటికీ, హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో నమోదు శాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, నమోదులో తక్కువ స్పందన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
100 ఏళ్లుగా మద్యానికి నో చెప్పిన తెలంగాణ గ్రామం.. ప్రశాంత జీవనానికి నిలువెత్తు నిదర్శనం.
SIR ప్రక్రియపై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొనడంతో ఎన్నికల శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, మెట్రో మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో ఎల్ఈడీ డిజిటల్ స్క్రీన్ల ద్వారా నమోదు విధానం, అవసరమైన వివరాలు, చివరి తేదీ వంటి అంశాలను ప్రదర్శిస్తున్నారు.
అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. గడువు ఆగస్టు 3 వరకు పొడిగించబడిన విషయాన్ని కూడా స్పష్టంగా ప్రచారం చేస్తున్నారు.
ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న బూత్ లెవల్ అధికారులు (BLOలు) కూడా ప్రజలకు సహాయం చేస్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరికీ పూర్తి సమాచారం చేరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ ప్రచారం ద్వారా మరింత మందికి సమాచారం చేరవేయాలని ఎన్నికల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకున్నప్పటికీ, ఇంకా నమోదు చేసుకోని వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. “SIR ప్రక్రియలో పేరు నమోదు చేసుకుని మీ ఓటు హక్కును కాపాడుకోండి” అనే సందేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కొనసాగుతోంది.
ఆగస్టు 3 వరకు కొనసాగే ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఓటరు పాల్గొని తమ వివరాలను ధృవీకరించుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.